- ఓట్లను అడ్డుకునేందుకు ఈవీఎంలకు టేపులు
- ఓటర్లను గుర్తించేందుకు అత్తరు పూసిన వైనం
పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ సాగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేలా సాగిన ఈ ఉల్లంఘనల నేపథ్యంలోనే, నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మే 21న తిరిగి ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. పోలింగ్ కేంద్రాలను బలవంతంగా ఆక్రమించుకోవడం, అసలైన ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తూ ఓటు వేయనీయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలు ఇక్కడ భారీగా చోటుచేసుకున్నాయి.
మరీ ముఖ్యంగా, ఈవీఎంలలోని కొన్ని బటన్లపై నల్లటి టేపులు వేసి ఓట్లను బ్లాక్ చేయడం , ఓటర్లు ఎవరికి ఓటు వేశారో గుర్తించేందుకు బటన్లకు అత్తరు (perfume) లేదా సిరా పూయడం వంటి వికృత చేష్టలకు కొందరు పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది. పోలింగ్ కేంద్రాల్లోని భద్రతను , రహస్య ఓటింగ్ నిబంధనలను తుంగలో తొక్కుతూ అనధికార వ్యక్తులు ఓటింగ్ కంపార్ట్మెంట్లలోకి ప్రవేశించడం, ఒకే వ్యక్తి పదేపదే ఓటు వేయడం , పోలింగ్ అధికారులు ఓటర్లను ప్రభావితం చేయడం వంటి అక్రమాలు కెమెరా ఫీడ్లో నిక్షిప్తమయ్యాయి.
అనేక చోట్ల వెబ్ కాస్టింగ్ వీడియో ఫుటేజీలు మాయం కావడం లేదా స్టోరేజీ చిప్స్ ఖాళీగా ఉండటం పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్రను సూచిస్తోంది. గ్రౌండ్ రిపోర్టులు , వీడియో ఆధారాలు పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని తేల్చడంతో ఎన్నికల సంఘం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఫాల్తాలో మే 21న రీ-పోలింగ్ నిర్వహించి, మే 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
No comments:
Post a Comment