పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఏఐఎన్ఆర్సీ (AINRC) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎన్. రంగసామి శుక్రవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్నాథన్ను కలిసి, తమకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యుల జాబితాను అందజేసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అంతకుముందు జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో రంగసామి ఏకగ్రీవంగా నేతగా ఎన్నికయ్యారు. పుదుచ్చేరి హోంమంత్రి ఏ. నమశ్శివాయం ఎన్డీయే శాసనసభాపక్ష ఉపనేతగా ఎంపికయ్యారు.
మొత్తం 30 స్థానాలు కలిగిన పుదుచ్చేరి అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఇందులో ఎన్ఆర్ కాంగ్రెస్ 12 సీట్లు, బీజేపీ 4, ఏఐఏడీఎంకే, ఎల్జేకే చెరో సీటు గెలుచుకున్నాయి. ఈ విజయంతో రంగసామి ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మే 13న ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా, ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే 5 స్థానాలను, కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకోగా, నూతనంగా ఏర్పడిన టీవీకే (TVK) రెండు స్థానాల్లో విజయం సాధించి ఆశ్చర్యపరిచింది. రంగసామి తన సొంత నియోజకవర్గమైన తట్టంచావడిలో భారీ మెజారిటీతో విజయం సాధించి తన పట్టును నిరూపించుకున్నారు.
No comments:
Post a Comment