- అన్నాడీఎంకే కూటమిలోకి ఏఎంఎంకే రాక
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS)కి తన పూర్తి మద్దతు ఉంటుందని ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ప్రకటించారు. గతంలో పార్టీ నాయకత్వం విషయంలో తీవ్ర విభేదాలతో విడిపోయిన ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఒక్కటవ్వడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం రాత్రి జరిగిన కీలక సమావేశం అనంతరం దినకరన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తాము అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
గుర్రపు బేరాలు, ఫోర్జరీ రాజకీయాలకు చెక్ పెట్టాలంటే విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈపీఎస్ అనుభవం , అన్నాడీఎంకేకున్న బలమైన ఓటు బ్యాంకు తమిళనాడులో మళ్ళీ అమ్మ పాలనను తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల కలిగిన నష్టాన్ని గ్రహించిన ఇరు పార్టీలు, ఈసారి ఐక్యంగా ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. ఓ పీ పన్నీర్సెల్వం వర్గంతో విభేదాలు కొనసాగుతున్నప్పటికీ, దినకరన్ రాకతో అన్నాడీఎంకే క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ కూటమి రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment