Wednesday, 6 May 2026

అది 'మత్ గడన' కాదు.. 'మన్ గడన'


  • బెంగాల్ గెలుపుపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు



పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన భారీ విజయంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు పారదర్శకంగా రాలేదని, బీజేపీ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తారుమారు చేసిందని ఆయన ఆరోపించారు. లక్నోలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ చేసింది ఓట్ల లెక్కింపు (మత్ గడన) కాదని, తమకు నచ్చినట్లుగా ముందే నిర్ణయించుకున్న కల్పిత ఫలితాలను (మన్ గడన) ప్రకటించారని ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, ఎన్నికల సంఘం మరియు అధికార యంత్రాంగాన్ని వాడుకుని బీజేపీ విజయం సాధించిందని అఖిలేష్ విమర్శించారు. ఈ అక్రమాలను అరికట్టడానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం (Live Telecast) చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. "కోర్టు విచారణలే లైవ్ స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు, ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపును ప్రజలందరికీ నేరుగా ఎందుకు చూపించకూడదు?" అని ఆయన ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజీని బహిర్గతం చేయాలని, దీనిపై సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. బెంగాల్‌లో ప్రయోగించిన ఈ 'ఎన్నికల మాఫియా' వ్యూహాలను వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అంతకంటే పెద్ద ఎత్తున అమలు చేసే అవకాశం ఉందని, అందుకే ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మమతా బెనర్జీకి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, త్వరలోనే ఆమెను కలవడానికి కోల్‌కతా వెళ్తానని అఖిలేష్ ప్రకటించారు.

No comments:

Post a Comment

Featured post

నమ్మకద్రోహానికి పరాకాష్ట

మిత్రధర్మాన్ని కాలరాశారంటూ తీవ్ర ఆగ్రహం కాంగ్రెస్‌పై డీఎంకే నిప్పులు తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ మైత్...