- ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్తగా ఎంపికైన 51 వేల మందికి నియామక పత్రాలు
- ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉపాధి అవకాశాల విస్తరణ.. రూ.లక్ష కోట్లతో ‘రోజ్గార్ యోజన’
- దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు.. యువతకు కొత్త అవకాశాలంటున్న ప్రధాని
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొత్తగా నియమితులైన 51 వేల మందికి పైగా యువతకు ప్రధాని నరేంద్ర మోదీ నియామక పత్రాలు అందజేశారు. శనివారం జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాల్లో నిరంతరం దృష్టి సారించిందని మోదీ తెలిపారు.
ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రధాని చెప్పారు. ఇందులో భాగంగా సుమారు రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా దాదాపు రెండు కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు.
గత కొన్నేళ్లలో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా భారతీయ పారిశ్రామికవేత్తలకు కొత్త భాగస్వామ్యాలు, మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని, తద్వారా యువతకు కొత్త కెరీర్ అవకాశాలు కూడా ఏర్పడతాయని చెప్పారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధాని తెలిపారు.
No comments:
Post a Comment