కాఠ్మాండు, ఆగస్టు 26: నేపాల్-చైనా సరిహద్దు హిమాలయ ప్రాంతాన్ని బుధవారం అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలకు ఎత్తైన పర్వతాల్లోని భారీ హిమనదం ముక్క విరిగిపడటమే కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. భూగర్భ శాస్త్రవేత్తలు, హిమనద శాస్త్ర నిపుణులు దీన్ని ‘ఐస్ అవలాంచ్’గా భావిస్తున్నారు. అంటే హిమనదం నుంచి భారీ మొత్తంలో మంచు ఒక్కసారిగా విరిగిపడి కిందికి దూసుకెళ్లే ఘటన.
కాల్గరీ యూనివర్సిటీకి చెందిన భూగర్భ శాస్త్రవేత్త డేనియల్ షుగర్ ఉపగ్రహ చిత్రాలను పరిశీలించగా.. సుమారు 2,000 అడుగుల వెడల్పున్న హిమనదం భాగం దాదాపు 17,000 అడుగుల ఎత్తు నుంచి విడిపోయినట్లు కనిపించింది. అది దాదాపు 4,000 అడుగులు కిందికి జారిపడి లోయకు చేరినప్పుడు మంచు, నీరు, రాళ్లు భారీ వేగంతో ల్హెండే ఖోలా నదివైపు, అక్కడి నుంచి నేపాల్-చైనా సరిహద్దు సమీపంలోని భోటేకోశి నదిలోకి దూసుకెళ్లినట్లు అంచనా.
“హిమనదం భాగం ఒకేసారి విరిగి పడినట్లు కనిపిస్తోంది. ఒక కిలోమీటరుకు పైగా ఎత్తు నుంచి నేరుగా లోయలోకి పడటంతో భారీ విధ్వంసం జరిగింది” అని షుగర్ పేర్కొన్నారు. ఘటన అనంతరం అక్కడి పరిస్థితి బాంబు పేలిన ప్రాంతంలా ఉందని తెలిపారు.
మంచు నుంచి ఎలా భారీ వరద వచ్చింది?
ఎత్తైన ప్రాంతం నుంచి భారీ హిమఖండం కిందికి పడటంతో అపారమైన శక్తి విడుదలైందని యూనివర్సిటీ ఆఫ్ డండీకి చెందిన హిమనద శాస్త్రవేత్త సైమన్ కుక్ తెలిపారు. మంచు బలమైన దెబ్బకు చిన్నచిన్న ముక్కలుగా మారి నీరు, మట్టి, రాళ్లతో కలిసి అత్యంత వేగంగా కిందికి ప్రవహించి ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.
ఈ ప్రవాహం ల్హెండే ఖోలా, భోటేకోశి నదుల వైపు దూసుకెళ్లి మార్గంలోని నివాస ప్రాంతాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులను ధ్వంసం చేసింది. మరోవైపు ల్హెండే ఖోలాలో పైప్రాంతంలో ఇప్పటికీ అడ్డంకి ఉండటంతో మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు.
అయితే విపత్తుకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా ఖరారు కాలేదు. బుధవారం ఉదయం ఈ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో భూకంపం కారణంగా హిమనదం లేదా మంచు-రాళ్ల కొండచరియలు విరిగిపడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఇప్పుడే తుది నిర్ధారణకు రావడం సాధ్యం కాదని చెబుతున్నారు.
వేడెక్కుతున్న హిమాలయాలకు హెచ్చరిక
గత 14 నెలల్లో ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ నిపుణులు తెలిపారు. ల్హెండే ఖోలా రెండుసార్లు వరదలకు గురైందని, గత ఏడాది వరదకు టిబెట్లోని హిమనద సరస్సు పొంగిపొర్లడమే కారణమని పేర్కొన్నారు.
నేపాల్ వైపు ఉన్న హిమనదం నుంచి మంచు-రాళ్ల భారీ ప్రవాహం నదిని అడ్డుకుని, అనంతరం ఒక్కసారిగా నీరు దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లడం తాజా విపత్తుకు కారణమై ఉండొచ్చని విపత్తు నిర్వహణ నిపుణుడు శశ్వత సన్యాల్ తెలిపారు. వేడెక్కుతున్న హిమాలయాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
వాతావరణ మార్పులతో హిందూకుష్-హిమాలయ ప్రాంతంలో హిమనదాలు వేగంగా కరుగుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. 2000 సంవత్సరం తర్వాత మంచు నష్టపు వేగం మరింత పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
తాజా వరదలతో నేపాల్, టిబెట్లో పలువురు మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. పర్యాటకులు, కార్మికులు, యాత్రికులు కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. దెబ్బతిన్న రహదారులు, భారీగా పేరుకుపోయిన మట్టి, అస్థిర పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఎత్తైన హిమాలయాల్లో జరిగిన చిన్న మార్పు కూడా క్షణాల్లో భారీ నీరు, మట్టి, రాళ్ల ప్రవాహంగా మారి దిగువ ప్రాంతాల్లో ఎంతటి విషాదాన్ని సృష్టించగలదో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.





